పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

by  |
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక నవంబర్ 3వ తేదీన ఉన్నందున ఆదివారం పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పోలీస్ అధికారులకు, సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

రూట్ మొబైల్ పార్టీలు ఈవీఎంలకు ఎస్కార్ట్‌గా ఉండి పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రానికి చేర్చి, తిరిగి ఎస్కార్ట్‌గా వచ్చి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అప్పగించే అంతవరకూ అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంల భద్రత మనపై ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలను కలుపుతూ.. ఉన్న రూట్లలో పోలింగ్ కేంద్రం సమీపంలో ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల 200 గజాల వరకూ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన టేబుల్స్ వేయడానికి వీలులేదన్నారు. ఓటర్లను ప్రైవేట్ వాహనాలు ఆటోలు, జీపులు, కార్లలో, తీసుకురాకుండా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్‌‌లో ఈవీఎంల భద్రత, ఎన్నికల సామాగ్రి భద్రతా, పోలింగ్ పూర్తయిన తర్వాత తిరిగి పంపే అంతవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు మార్క్ పోలింగ్ ఉన్నందున అధికారులు సిబ్బంది ఆరు గంటలలోపు యూనిఫాంలో విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో ప్రిసిడింగ్ అధికారి ఆదేశాల మేరకు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలని, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటు వేసిన వారిని కేంద్రం నుంచి బయటకు పంపించాలన్నారు.

అంతేగాకుండా అధికారులు సిబ్బంది ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి, అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లు వద్ద అగ్గిపెట్టెలు, నీళ్ల బాటిళ్లు, సెల్ ఫోన్లు, మరే ఇతర వస్తువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, పసి పిల్లల తల్లులు, ఓట్లు వేయడానికి వచ్చే సమయంలో వీలైనంత త్వరగా ఓటు వేయించి బయటకు పంపించేలా చూడాలన్నారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.

చెక్‌పోస్టు వద్ద అన్ని వాహనాలను తనిఖీ చేయాలని అక్రమ మద్యం డబ్బు రవాణా కాకుండా చూడాలని తెలిపారు. అన్ని పార్టీల వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఓటర్లను తరలించే వాహనాలను స్వాధీనపరచు కోవాలన్నారు. వాహనాలు తనిఖీ చేసే సమయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పగలు రాత్రి అప్రమత్తంగా ఉంటూ 24×7 విధులు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కమిషనర్ తెలిపారు.



Next Story

Most Viewed