‘దినసరి’ బతుకులు.. దినదిన గండం

by  |
‘దినసరి’ బతుకులు.. దినదిన గండం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ‘మాకు తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. ఉండడానికి గూడు లేదు. ఏడా నిలబడ్డ, ఏడా పడుకున్న పోలీసులు తరుముతున్నారు. ఇంటికి పోదామంటే బస్సులు, రైళ్లు నడువడం లేవు. ఐదు రోజుల నుంచి బుక్కెడు బువ్వలేక కుడుపు మాడిపోతోంది. మమ్ముల్ని మా ఇంటికి పంపించండి. మాకు ఏదైనా మార్గం చూపండి’’ ఇది బతుకు దెరువు కోసం పట్నం వచ్చి హోటల్, క్యాంటీన్, దినసరి కూలీలుగా పనులు చేసుకుంటూ ఎక్కడ రాత్రియితే అక్కడే తలదాచుకునే వారి ఆవేదన ఇది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పొట్టకూటి కోసం దొరికిన పని చేసుకుంటూ జీవన సాగిస్తున్న వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో హైదరాబాద్‌లోని అన్ని వ్యాపార సంస్థలు మూసివేశారు. చిన్న, చిన్న హోటళ్లు కూడా మూసివేయడంతో హోటల్స్, క్యాంటీన్‌లల్లో దినసరి కూలీ చేస్తూ పూటగడుపుతున్నవారు హైదరాబాద్ మహానగరంలో సుమారు 10 వేల పైచిలుకు ఉంటారు. ఐదు రోజుల నుంచి అన్ని సంస్థలు, హోటల్స్ బంద్ చేయడంతో వీరంతా రోడ్ల మీదికి వచ్చారు. దిక్కుమొక్కులేని వారు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో రోడ్ల పైన తిరుగుతున్నారు. తినడానికి తిండి లేక ఎవరైనా దాతలు అన్నదానం చేస్తే తప్ప వారికి తిండిదొరకదు. లాక్‌డౌన్ నింబంధనలు కఠినంగా ఉండడంతో దాతలు కూడా బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఒక్కరిద్దరు దాతలు బయటికి వచ్చి అన్నదానం చేద్దామంటే పోలీసుల బెదిరింపులు తప్పడం లేవు. దిక్కుమొక్కు లేనివారు ఇంటికి పోదామంటే రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నవారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఉండడానికి నిలువ నీడ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి అన్నదాతల కోసం కండ్లు గుంతులకు పోయేలా ఎదురు చూస్తున్నారు. దాతలు పెడితే తప్ప వీరికి బుక్కెడు బువ్వ దొరకదు. దాతలు ఎవరు అన్నదానం చేయకపోతే ఆ రోజుకు నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రేషన్‌కార్డు ఉన్నవారికి బియం, రూ.1500 ఇస్తామంటుంది. మా కోసం ఎందుకు అలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కూడా భరోసా నివ్వాలని కోరుతున్నారు.

ప్రభుత్వం మమ్ముల ఆదుకోవాలి: భాస్కర్ దినసరి కూలీ, ప్రకాశం జిల్లా

నాకు ఇంటి కాడా ఎవరూ లేరు. పదేండ్ల నుంచి పట్నంలో ఎక్కడ పనిదొరికితే అక్కడే చేసి వచ్చిన డబ్బులతో జీవనం గడుపుతున్న. ఐదు రోజుల నుంచి అన్నీ బంద్ అవడంతో ఎవరు పనులు చెప్పడం లేరు. ఎక్కడా ఉండనిస్తాలేరు. ఎక్కడ ఉండాలో తెలువక సాయిబాబా గుడి దగ్గర ఉంటున్న. ఇక్కడ కూడా పోలీసులు ఉండనివ్వడటం లేదు. పోలీసులు వచ్చినప్పుడు దాచుకుంటున్నాం. దాతలు ఎవరైనా అన్నం పెడితే తింటున్నం లేకా పోతే పస్తులే. ప్రభుత్వం మాకు ఎదైన మార్గం చూపాలి.

మా ఇంటికి పంపించాలి: శంకర్ దినసరి కూలీ, అనంతపురం జిల్లా

ఆరునెలల కింద హైదరాబాద్‌కు వచ్చా. హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉన్నా. ఐదు రోజులుగా హోటళ్లు బంద్ చేయడంతో అక్కడి నుంచి పంపించారు. ఇంటికి పోదామంటే బస్సులు లేవు. ఇక్కడా ఉండడానికి షెల్టర్ లేదు. ఎక్కడా తినాలో ఎక్కడ పడుకోవాలో తెలువడం లేదు. రోడ్ల మీదనే తిరుగుతున్నాం. ఎవరైనా అన్నదానం చేస్తే తప్ప ఏమీ దొరకడం లేవు. ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకొని మమ్ముల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేయాలి.

tags : daily labor,hotel, Canteen,Buses, trains


Next Story

Most Viewed