ఈఎన్‌టీలో బ్లాక్ ఫంగస్‌ శస్త్ర చికిత్సలు కష్టమేనా..?

by  |
Koti ENT
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రత పెరిగిన పేషెంట్లకు తప్పనిసరిగా సర్జరీలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత అవయవాలను తొలగిస్తేనే పేషెంట్ల ప్రాణాలను కాపాడగలరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈఎన్‌టీ ఆసుపత్రిలో సర్జరీ డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నైపుణ్యం కలిగిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రికి చేరిన బ్లాక్ ఫంగస్ పేషెంట్లు చికిత్సల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నోడల్ ఆసుపత్రిగా ఈఎన్‌టీ ఆసుపత్రి ఏర్పాటు చేసి సరిపడా మందులను, టెస్టింగ్ కిట్లను, స్ర్కీనింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం మరిచింది. రోజుకు వందల సంఖ్యలో చికిత్స కోసం వస్తున్న బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రత పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లను మాత్రం చేపట్టడం లేదు. చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా బ్లాక్ ఫంగస్ పేషెంట్లు మరణించిన తరువాతే ప్రభుత్వం మేల్కొనేలా ఉంది. కరోనా సెకండ్ వేవ్ మొదట్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఊహించని రీతిలో ప్రాణనష్టం జరుతుంది. ఇలాంటి పరిస్థితులే బ్లాక్ ఫంగస్ విషయంలో కూడా తలెత్తనున్నాయనే భయాందోళనలు మొదలయ్యాయి.

ఈఎన్‌టీ ఆసుపత్రిలో సర్జరీ డాక్టర్ల కొరత

ఈఎన్‌టీ ఆసుప్రతిలోని 202 బెడ్లన్ని పూర్తిగా పేషెంట్లతో నిండిపోయాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రత పెరిగిన పేషెంట్లకు సర్జరీలు చేయడం ద్వారానే ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ముక్కు, గొంతు, కంటి అవయవాలల్లో వ్యాధి ప్రబలితే తప్పని సరిగా ఆ అవయవానని తొలగించాల్సి ఉంటుంది. ఈఎన్‌టీ ఆసుపత్రిలో సర్జరీలు చేసేందుకు తీవ్రతమైన డాక్టర్ల కొరత ఏర్పడింది.

నోడల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేసిన తరువాత అదనంగా సర్జరీ డాక్టర్లను ప్రభుత్వం నియమించలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి డాక్టర్లు వందల సంఖ్యలో వస్తున్న పేషెంట్లకు చికిత్సలందించడం పెను సవాల్ గా మారింది. ఇప్పటి వరకు 200 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చేరగా వీరిలో కేవలం ఐదుగురికి మాత్రమే సర్జరీలు నిర్వహించారు. సర్జరీలు చేపట్టకుండా ఏమాత్రం ఆలస్యం చేసిన పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం పొంచి ఉంది.

వ్యాధి సోకిన పేషెంట్లకు స్ర్కీనింగ్‌ చేపట్టి వ్యాధి తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది. కాని ఈఎన్‌టీ ఆసుపత్రిలో సరిపడా స్ర్కీనింగ్ పరికరాలు లేకపోవడంతో డాక్టర్లు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు రెఫర్ చేస్తున్నారు. చికిత్సలకు సరిపడా మందులు లేకపోవడం వలన పేషెంట్లకు వ్యాధి తీవ్రత పెరుగుతుంది.



Next Story

Most Viewed