నైట్ కర్ఫ్యూ : మీడియా,పెట్రోల్ బంకులకు మినహాయింపు

by  |
నైట్ కర్ఫ్యూ : మీడియా,పెట్రోల్ బంకులకు మినహాయింపు
X

దిశ, నల్లగొండ : కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

అత్యవ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు కర్ఫ్యూ నుండి మిన‌హాయింపు ఇచ్చినట్లు తెలిపారు. రాత్రి పూట 8-00 గంట‌ల నుంచి ఉద‌యం 5-00 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లలో ఉంటుందన్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల‌యాలు, సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలు, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్లు రాత్రి 8-00 లోగా మూసివేయాలని, రాత్రి 9-00 గంట‌ల త‌ర్వాత క‌ర్ఫ్యూ పటిష్టంగా అమ‌లు చేస్తామన్నారు. కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడిక‌ల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు త‌ప్పనిస‌రిగా ఐడీ కార్డుల‌ను చూపాలని కోరారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు వ్యాలిడ్ టికెట్లను వ‌ద్దే ఉంచుకొని కర్ఫ్యూ సమయంలో వాటిని చూపించాల్సి ఉంటుందని, అంత‌ర్ రాష్ట్ర స‌ర్వీసులు, రాష్ట్ర స‌ర్వీసులు య‌థావిధిగా కొన‌సాగుతాయని ఆయన తెలిపారు.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారు పోలీసులకు సహకరించి కరోనా కట్టడికి కృషి చేయాలని డీఐజీ రంగనాథ్ తెలిపారు.

Next Story