బ్రేకింగ్: ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తన ఇలాకాలోనే షాక్..

by  |
mla raj-gopal-reddy
X

దిశ, మునుగోడు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయని కిసాన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏపూరి సతీష్ అభిప్రాయపడ్డారు. గురువారం నారాయణపురం కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలను అవమానపరిచే విధంగా ఎమ్మెల్యే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి చేస్తున్నా కాంగ్రెస్ సేనను ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.

congress leaders

ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ అధ్యక్షులు ఇచ్చిన చలో రాజ్ భవన్, ఎడ్లబండ్ల నిరసన కార్యక్రమం నిర్వహించకుండా తన సొంత కార్యక్రమాలను పిలుపునిచ్చి కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాడని అన్నారు. ఈనెల 9న టీపీసీసీ నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి వెళ్లకుండా సొంత ఎజెండాతో నియోజకవర్గంలో అదేరోజు దళిత బంధువులతో దీక్షను చేపట్టడానికి మంతనాలు జరపడం సరైన పద్ధతి కాదని అన్నారు.

మునుగోడు అభివృద్ధికి పాటుపడాలి అనుకుంటే కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విధానాల వల్ల ఇప్పటికే నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు పార్టీని వీడి ఇతర పార్టీలోకి వలసలు వెళ్తున్నారని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చే కార్యక్రమాలలో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కె.బడే సాబ్,చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కరంటోతూ ప్రజ్ఞా నాయక్ పాల్గొన్నారు.

Next Story