మా కూటమి దేశానికి దారి చూపింది

by  |
మా కూటమి దేశానికి దారి చూపింది
X

ముంబయి : సిద్ధాంతపరంగా విబేధాలున్నా మూడు వేర్వేరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడలనుకునే వారికి దారి చూపాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగ లేఖకు ఆయన స్పందించారు. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో మూడు వేర్వేరు పార్టీలు కలిసి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసి దేశానికి ఒక దారి చూపించాయి.

ఈ కూటమి ఆదర్శవంతమైన పాలన అందిస్తు్న్నది. జాతీయ స్థాయిలో ఈ ప్రయోగం యూపీఎ అనుకరించాలి. మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్న కూటమి కూడా ఇదే సూచిస్తున్నది’ అంటూ మాట్లాడారు. కొత్త కూటమి ఏర్పాటుపై ప్రతిపక్ష రాజకీయ నాయకులు కలిసి చర్చించుకోవాలని రౌత్ తెలిపారు. 1975 తర్వాత దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ జయప్రకాశ్ నారాయణ్ ఏకతాటిపైకి తెచ్చారనీ, కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో అలాంటి నాయకుడెవరూ లేరని అన్నారు. కాగా.. కొద్దికాలంగా మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందా..? కూలుతుందా..? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్న తరుణాన సంజయ్ రౌత్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు తెగదెంపు చేసుకున్న శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed