ఆ సభ కోసమే షర్మిల సన్నాహాలు

by  |
ఆ సభ కోసమే షర్మిల సన్నాహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ప్రకటన నుంచి ఆయా జిల్లాల వారీగా వైఎస్‌ అభిమానులు, నాయకులతో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల మరింత స్పీడ్‌ పెంచారు. లోటస్‌ పాండ్‌‌కు వచ్చిన నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రాంతీయ సమస్యలను తెలుసుకుంటూనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అందుకుగాను షర్మిల.. అనుచరుడు కొండా రాఘవరెడ్డి, మరికొందరు ముఖ్య నేతలతో ఆదివారం ఖమ్మం బయల్దేరనున్నారు. అక్కడున్న వైఎస్సార్‌ అభిమానులను కలిసి బహిరంగ సభ ఏర్పాటుపై చర్చలు జరుపనున్నారు. అంతేకాకుండా, జనాన్ని కూడా భారీగా సమీకరించి సభను సక్సెస్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సభ సక్సెస్ కోసమే.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానని సంచలనం సృష్టించిన షర్మిల ఖమ్మం బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ సభకు వచ్చే జనం, అభిమానులనే రాష్ట్రంలోని ఇతర పార్టీలకు చూపించి తామేంటో తెలియజేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఖమ్మం సభకు సమయం ఎక్కువగానే ఉన్నా.. ఇప్పటి నుంచే ఒక్కో పనిని చేపట్టి సభను సక్సెస్‌ చేయాలని భావిస్తున్నారు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు, వైఎస్సార్‌ అభిమానులకు వివరించి బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకే షర్మిల అనుచరులు అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed