ఖమ్మం సభలో షర్మిల భారీ ప్లాన్

by  |
ఖమ్మం సభలో షర్మిల భారీ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పాలకుల వైఫల్యాలపై షర్మిల ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎంతమేరకు అమలయ్యాయనే అంశాలపై ఆమె విశ్లేషిస్తున్నారు. నెరవేర్చకుండా మిగిలిపోయిన అంశాల గురించి ఆరా తీస్తున్నారు. వీటన్నింటిని ఖమ్మం పట్టణంలో ఏప్రిల్ 9న జరిగే సంకల్ప సభలో ప్రస్తావించనున్నారు. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆమె సూటిగా విమర్శించునున్నారు. మొత్తానికి ప్రభుత్వాలను నిలదీయాలనేదే షర్మిల వైఖరిగా అర్థమవుతోంది.

ఉద్యోగ ఖాళీల భర్తీపై ఫైట్

నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా పోరాడి తెలంగాణను సాధిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మభ్యపెడుతున్న అంశంపై సీఎం కేసీఆర్ను టార్గెట్ చేయాలని షర్మిల భావిస్తున్నారు. ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని మహబూబాబాద్కు చెందిన కేయూ విద్యార్థి బోడ సునీల్ కుమార్, సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆత్మహత్య చేసుకున్న మరో యువకుడి బలిదానాలే ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

అన్ని ప్రాంతాల సమస్యలపై..

పార్టీ ప్రకటన నాటి నుంచి లోటస్ పాండ్ వేదికగా షర్మిల తొమ్మిది జిల్లాల అభిమానులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా ప్రాంతాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ఆమె తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగు, సాగునీటి సమస్యలు, విద్య, వైద్యం, ప్రాజెక్టులు, పోడు భూముల సమస్యలపై ఖమ్మం సభలో షర్మిల గళం వినిపించనున్నట్లు సమాచారం. వీటిని పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే అంశాలను లేవనెత్తి ప్రజల్లో సర్కార్ పై నెగెటివ్ టాక్ వచ్చేలా చూడాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాలమూరులోనే జెండా, ఎజెండాపై క్లారిటీ

ఖమ్మం జిల్లాలో నిర్వహించే సభమీదే షర్మిల తన దృష్టిసారిస్తున్నారు. లోటస్ పాండ్ నుంచే సభ ఏర్పాట్లను తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు ముఖ్య నేతలతో సభకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సభలోనే పార్టీ పేరు, జెండా, ఎజెండాపై క్లారిటీ ఇస్తారని తొలుత అనుకున్నప్పటికీ మే నెలలో మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించే సభలో ప్రకటిస్తారని షర్మిల కార్యాలయవర్గం స్పష్టం చేసింది.

Next Story