కొండా ముర‌ళి వాడిపడేసే ఓ చెత్త.. షర్మిల అనుచరులు ఆగ్రహం

by  |
కొండా ముర‌ళి వాడిపడేసే ఓ చెత్త.. షర్మిల అనుచరులు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంత డబ్బు ఇచ్చినా షర్మిల పార్టీలో చేరేదే లేదంటూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలను ఆమె టీమ్ ఖండించింది. ఇప్పటివరకు కొండా మురళితో మాట్లాడనేలేదని, ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించనూ లేదని షర్మిల అనుచరుడు పిట్ట రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కోడానికి తమది టీఆర్ఎస్ పార్టీ కాదని, విలువల గురించి కొండా మురళి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన వాడిపడేసే చెత్త లాంటివారని, ఆయనతో బేరసారాలు చేయాల్సిన అవసరమే లేదని, అలాంటివారికి తమ పార్టీలో స్థానమే ఉండదని రాంరెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకు కావాల్సినంత బలగం ఉందని, వారి నుంచే నాయకత్వాన్ని తయారు చేసుకుంటామన్నారు.

పార్టీలో చేరాల్సిందిగా ఆఫర్ ఇవ్వడంతో పాటు పది వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నట్లుగా కొండా మురళి బహిరంగ వ్యాఖ్యలు చేశారని, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేనే లేదని, కొనుక్కోడానికి తమది టీఆర్ఎస్ లాంటి పార్టీ కాదని రాంరెడ్డి పేర్కొన్నారు. విలువ‌లు గురించి కొండా ముర‌ళి మాట్లాడ‌టం దెయ్యాలు వేదాంతాలు వల్లించడమేనన్నారు. విలువ‌ల గురించి మాట్లాడే ముందు ఆయన తన రాజ‌కీయ జీవితంలో ఎన్ని గుమ్మాలు తొక్కారో, ఎన్ని వాకిళ్లు తిరిగారో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు.



Next Story

Most Viewed