సూర్యాపేట జిల్లాలో షర్మిల ‘దళిత భేరి’ బహిరంగ సభ

by  |
YSR TP
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి మండ‌లకేంద్రంలో ఈనెల 12వ తేదీన ‘దళిత భేరి’ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న తెలిపారు. లోటస్ పాండ్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ద‌ళితుల పేరిట రాజ‌కీయ ఆట న‌డుస్తోందని విమర్శించారు. రాష్ట్రం కోసం ద‌ళితులు ఎన్నో ఉద్యమాలు చేశారని, అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ద‌ళితుల‌ను వాడుకుంటున్నారన్నారు. ఏడేండ్లుగా ద‌ళితుల‌ కోసం ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం దళిత బంధు పథకాన్ని ప్రకటించిందని అన్నారు. ద‌ళితులు మ‌రోసారి కేసీఆర్ మాయ‌లో ప‌డొద్దని ఆయన కోరారు.

సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చిన మూడెక‌రాల భూమి, ఎస్సీ కార్పొరేష‌న్ లోన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనే ద‌ళితుల‌ను నిట్టనిలువునా ముంచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని కూడా గతంలో దళితులకు ఇచ్చిన హామీలాగే నీరుగారుస్తారని ఆరోపించారు. ప్రతి ద‌ళిత కుటుంబానికి రూ.50 ల‌క్షలు చెల్లించాలని ఏపూరి డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఖరిని ఎండగట్టేందుకే ఈనెల 12న ‘ద‌ళిత భేరి’ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం ఈ స‌భ‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ క‌న్వీన‌ర్ జిమ్మి బాబు, కో క‌న్వీన‌ర్ స‌తీశ్ కుమార్‌, భువ‌న‌గిరి పార్లమెంట్ క‌న్వీన‌ర్ సునీల్ కుమార్‌, క‌రీంన‌గ‌ర్ పార్లమెంట్ కో క‌న్వీన‌ర్ సత్యరాజ్, నాయ‌కులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed