సిద్ధంగా ఉన్న ప్లాట్లపైనే ఇళ్ల కొనుగోలుదారుల ఆసక్తి!

by  |
సిద్ధంగా ఉన్న ప్లాట్లపైనే ఇళ్ల కొనుగోలుదారుల ఆసక్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020లో ప్రజలు ఎక్కువగా నిర్మాణంలో ఉన్న ప్లాట్ల కొనుగోలు కంటే పూర్తయిన రెసిడెన్షియల్ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపించారని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. గతేడాది మొత్తం గృహాల అమ్మకాల్లో పూర్తయిన ప్లాట్ల వాటా అంతకుముందున్న 18 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో మొత్తం 1.82 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని, వాటిలో 21 శాతం సిద్ధంగా ఉన్నవి. 79 శాతం నిర్మాణంలో ఉన్నాయని ప్రాప్‌టైగర్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. మొత్తం గృహాల విక్రయాల్లో పూర్తయిన ప్లాట్ల విక్రయాలు 2016 నుంచి పెరుగుతున్నట్టు సంస్థ అభిప్రాయపడింది.

2015లో మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 7 శాతం ఉండగా, 2016లో 10 శాతం, 2017లో 12 శాతం, 2018లో 15 శాతం, 2019లో 18 శాతానికి పెరిగాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. నగరాల వారీగా చూస్తే అత్యధికంగా పూర్తయిన ప్లాట్ల విక్రయాల్లో చెన్నై 32 శాతం వాటాను కలిగి ఉండగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో నమోదయ్యాయి. ‘రిస్క్ తక్కువగా ఉన్న రెడీ-టూ-మూవ్-ఇన్ ప్లాట్లను ఇళ్ల కొనుగోలుదారులు ఎంచుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న వాటిలో కూడా బ్రాండెడ్ డెవలపర్లు, మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నారని’ ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఈఓ ధృవ్ అగర్వాల్ వెల్లడించారు.


Next Story

Most Viewed