అమ్మకానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు?

by  |
Shamshabad Airport
X

శంషాబాద్ విమానాశ్రయం వాటాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అమ్మకానికి పెట్టనున్నది. జీఎంఆర్ నిర్వహణలో ఉన్న ఈ విమానాశ్రయంలో ఏఏఐ,రాష్ట్ర ప్రభుత్వం కలిపి 26% వాటాలున్నాయి. ఇందులో ఏఏఐ తనకున్న 13% వాటాలను విక్రయించనున్నది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు విమానాశ్రయాల వాటాలనూ ఉపసంహరించుకోనున్నది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్​ సమావేశానికి ఈ మేరకు నోట్​ పంపాలని ఏఏఐ భావిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే పలు విమానాశ్రయాల నుంచి వాటాలను ఉపసంహరించుకున్న భారత ఎయిర్‌పోర్టు అథారిటీ హైదరాబాద్ శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వాటాలను కూడా అమ్మకానికి పెట్టాలనుకుంటోంది. జీఎంఆర్ నిర్వహిస్తున్న ఈ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాలు, ఎయిర్‌‌పోర్టు అథారిటీ వాటాలు 26% ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు విమానాశ్రయాల వాటాలనూ ఉపసంహరించుకోవాలనుకుంటోంది. వీటితోపాటు మరో 13 చిన్న విమానాశ్రయాలలోనూ ఇదే తరహా ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశానికి ఈ మేరకు నోట్ పంపాలనుకుంటోంది అథారిటీ. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు వనరులను సమకూర్చుకోవాలని అనుకుంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ ఆలోచన మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఈ దిశగా అడుగులు వేస్తున్నది. రానున్న ఆర్థిక సంవత్సరానికి కనీసంగా రూ. 1.75 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రైవేటుకు దారులు

ఎయిర్‌పోర్టు అథారిటీ తన వాటాలను ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలనుకుంటోంది. విమానాశ్రయాలపై అదానీ గ్రూపు కన్ను వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మంగుళూరు, తిరువనంతపురం, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, గౌహతి విమానాశ్రయాలను అదానీ గ్రూపు దక్కించుకుంది. ముంబై విమానాశ్రయంలో ఆ గ్రూపుకు ఇప్పటికే 74% మేర వాటాలు ఉన్నాయి. మిగిలినదంతా అథారిటీ వాటాయే. ఇప్పుడు దాన్ని కూడా విక్రయించడం ద్వారా అదానీ గ్రూపుకు పూర్తిగా ధారాదత్తం చేయాలనుకుంటోంది. ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54% వాటా ఉండగా అథారిటీకి 26%, ఫ్రాపోర్టు ఏజీ, ఎరమిన్ మలేషియాకు 10% చొప్పున వాటాలు ఉన్నాయి. అథారిటీ తన 26% వాటాను వదిలించుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇక 13 చిన్నతరహా విమనాశ్రయాల విషయంలో విడిగా అమ్మడంకంటే ఈ నాలుగు ప్రధాన విమానాశ్రయాలతో కలిపి ప్యాకేజీగా రూపొందించి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా మంచి ధర వస్తుందని అథారిటీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా అథారిటీకి దాదాపు వంద విమానాశ్రయాలు ఉన్నాయి. ఇప్పటికే ఆరు పూర్తిగా ప్రైవేటుపరం కాగా, త్వరలో నాలుగు ప్రధాన విమానాశ్రయాలతో పాటు మరో 13 చిన్నవి కూడా ఆ జాబితాలోకి చేరనున్నాయి.


Next Story

Most Viewed