కాబూల్ విమానాశ్రయంలో ఏడుగురు మృతి.. అసలేం జరిగింది ?

by  |
kabul-airport
X

కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ ను అక్రమించుకోవడంతో అఫ్ఘాన్ పౌరుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. వారి బారి నుంచి తప్పించుకుని దేశం దాటి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాబూల్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద పెద్ద ఎత్తున జనం పోగవడంతో తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోయారు. చాలా మంది పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్ వెల్లడించారు.

దీంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో భయానక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. గత వారం అఫ్ఘాన్‌ను తాలిబన్లు అక్రమించగా, పశ్చిమ దేశాలు తమ పౌరులను తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, సురక్షితంగా, భద్రంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

తొక్కిసలాటలో చనిపోయిన అఫ్ఘాన్ పౌరుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. కాగా, శనివారం కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భద్రతా సమస్యల కారణంగా యూఎస్ పౌరులను అటువైపు రావొద్దని అమెరికా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు సంయమనం పాటించాలని కోరింది. పరిస్థితుల్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తు్న్నట్లు బ్రిటన్ మంత్రి తెలిపారు. కాగా, అమెరికా తమ పౌరులను తరలించేందుకు చివరి తేదీగా 31 పేర్కొన్న, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా దానిని పొడిగించే అవకాశముందని వాలేస్ తెలిపారు.


Next Story

Most Viewed