‘వాటి గురించి మాట్లాడితే నా తల నరికేస్తారు’

by  |
‘వాటి గురించి మాట్లాడితే నా తల నరికేస్తారు’
X

ముంబయి : భారత్‌లో తనకు పలువురు బడా వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ర్యాలీలు, కుంభమేళా వంటివి దేశంలో కరోనా ఉధృతికి కారణాలా..? అనేదానికి సమాధానం చెబితే తన తల నరుకుతారని వ్యాఖ్యానించారు. భారత్ లో వ్యాక్సిన్‌పై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో పూనావాలా తన కుటుంబంతో కలిసి ఇటీవలే యూకేకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో బడా వ్యక్తుల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ జాబితాలో పలువురు ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాలూ ఉన్నారు. వారంతా కొవిషీల్డ్ సరఫరా గురించి బెదిరిస్తున్నారు’ అని చెప్పారు. తనపై అతిపెద్ద బాధ్యత ఉన్నదని, కానీ అంతా తానొక్కడివల్లే కాదని తేల్చి చెప్పారు. భారత్ లో కరోనా ఉధృతి పెరిగిపోవడంతో వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరిగిందని, ప్రజల అంచనాలను అందుకోవడం అంత సాధారణ విషయం కాదన్నారు. ఈ సందర్భంగా.. ఎన్నికల ర్యాలీలు, కుంభమేళా వంటి వాటివల్లే దేశంలో కరోనా కేసులు పెరిగాయా..? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. ‘దానికి నేను సరైన సమాధానం చెబితే నా తల నరికేస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

మిమ్మల్ని బెదిరించిందెవరు..? : మహారాష్ట్ర

అదర్ పూనావాలా వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి శంభురా దేశాయ్ మాట్లాడుతూ.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఇదే విషయమై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. పూనావాలాకు తాము భద్రత కల్పిస్తామని, ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కేంద్రం ఆయనకు ఇప్పటికే ‘వై’ కేటగిరీ భద్రత కల్పించగా, అవసరమైతే మరింత రక్షణ ఇవ్వడానికి తమ ప్రభుత్వం (మహా వికాస్ అగాడి) సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదిలాఉండగా మహారాష్ట్ర మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. పూనావాలాకు బెదిరింపులు రావడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమేనని కామెంట్ చేశారు. వ్యాక్సిన్ ధరల్లో ఆయన చూపించిన వ్యత్యాసం కారణంగానే పూనావాలాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. పూనావాలాను బెదిరించిన వారి పేర్లను వెల్లడించాలని మరో మంత్రి జితేంద్ర అవ్హద్ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed