పండుగ ఉంది.. మా జీతాలివ్వండి.. ట్విట్టర్‌లో మంత్రులకు విజ్ఞప్తి

by  |
SERP workers
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగ ‘బతుకమ్మ’ సందర్భంగా వెంటనే తమ జీతాలు విడుదల చేయాలని ఐకేపీ ఉద్యోగులు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత, సీఎంఓకు ట్విట్టర్​వేదికగా విన్నవించారు. గతంలో ప్రతినెలా ఒకటో తేదీనాడే వేతనాలు వచ్చేవని, కానీ, సెర్ప్ సీఈఓగా ఇన్‌చార్జి అధికారులు కొనసాగుతున్న నేపథ్యంలో వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ప్రతినెలా రెండో వారం వరకూ జీతాలు ఇవ్వడం లేదని వారు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో దాదాపు నాలుగు వేలకు పైగా సెర్ప్‌లో పని చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంలో సెర్ప్​సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే దేశంలోనే మన సంఘాలు రుణాలు తీసుకోవడం, తిరుగు చెల్లింపుల్లో ముందున్నాయి. అయితే, సెర్ప్ సిబ్బందికి ఏడాది కాలంగా వేతనాలు మాత్రం సకాలంలో రావడం లేదు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. తాజాగా బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఇప్పటికైనా వేతనాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసుకున్నారు.

గతంలో సెర్ప్ పథకాల నిధుల్లో నుంచి అడ్వాన్స్ తీసుకుని ఒకటో తేదీనాడే జీతం ఇచ్చేవారని, బడ్జెట్ రాగానే ఆ నిధుల్లో సర్దుబాటు చేసేవారని గుర్తుచేశారు. పంచాయతీరాజ్ శాఖ, సెర్ప్‌లో ఓ కీలక అధికారి నిర్లక్ష్యం కారణంగానే వేతనాలు ఆలస్యమవుతున్నాయని వారు ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల వేతనాలు ఇంకా రాలేదని, వెంటనే సర్దుబాటు చేయాలని సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు కుంట గంగారెడ్డి, ఏపూరి నర్సయ్య, మహేందర్​రెడ్డి, సుభాష్​, సుదర్శన్​ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed