కరీంనగర్‌లో సంచలనంగా మారిన డమ్మీ FIR మ్యాటర్.. డీజీపీ ఫుల్ ఫోకస్

by  |
కరీంనగర్‌లో సంచలనంగా మారిన డమ్మీ FIR మ్యాటర్.. డీజీపీ ఫుల్ ఫోకస్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జారీ అయిన డమ్మీ ఎఫ్ఐఆర్ వెనుక జరిగిన కథేంటి..? ఇందుకు కారకులు ఎవరూ..? దీని వెనుక దాగి ఉన్న మర్మమేమిటీ అన్న వివరాలు తెలుసుకునే పనిలో పోలీసు ఉన్నతాధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. 2020 సెప్టెంబర్‌లో జారీ చేసిన ఈ డమ్మి ఎఫ్ఐఆర్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకుండా సాయంత్రం కల్లా రాజీ పడ్డారని క్లోజ్ చేయడంపై పోలీసు అధికారుల్లో సీరియస్ చర్చ సాగుతోంది. ఈ ఎఫ్ఐఆర్ జారీ వెనుక జరిగిన పూర్తి కథ ఏంటి అన్న వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఈ విషయంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తరువాత క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

అంతా పాత కథ..

ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందంటూ తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో బాధ్యులైన పోలీసు అధికారులు నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. 2020 సెప్టెంబర్‌లో జరిగిన విషయం అంటూ కవర్ చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. అయితే, ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పిదం జరగలేదని, భార్యాభర్తలు అండర్ స్టాండింగ్ కు రావడం వల్లే కాంప్రమైజ్ చేసి కేసు క్లోజ్ చేశామని కూడా అంటున్నట్టుగా సమాచారం. ఎఫ్ఐఆర్ జారీ చేసిన తరువాత కోర్టులో రాజీ పడాలని సూచించకుండా స్టేషన్‌లోనే కేసును మూసేందుకు పోలీసు అధికారులు ఎందుకు సాహసించారన్నదే అంతుచిక్కకుండా తయారైంది. నిబంధనలు కాదని పోలీసు అధికారులు అంత సాహసం చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అన్న విషయం తేలాల్సి ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం.

లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక…

ఎఫ్ఐఆర్ నెంబర్‌ 255ను జారీ చేసి వదిలేయడం వెనక ఎవరి అధికారుల హస్తం ఉంది, వారి లోగుట్టు ఏంటీ అన్న వివరాలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసు అధికారుల పాత్ర యాధృచ్ఛికంగానే ఉందా బలమైన కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ ఎఫ్ఐఆర్ జారీ చేసిన పోలీసు అధికారి ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారన్న కారణాన్ని చూపించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రిటైర్డ్ అయ్యే సమయంలో డమ్మి ఎఫ్ఐఆర్ జారీ చేసి క్లోజ్ చేసే సాహసం సదరు ఎస్ఐ సాహాసించే అవకాశం లేదన్నది వాస్తవం. రిటైర్ మెంట్ ముందు తాను ఇలాంటి దుస్సాహాసానికి పాల్పడితే పదవి విరమణ సమయంలో రావల్సిన బెనిఫిట్స్ కూడా అందవన్న భయం ఆయనలో వెంటాడం సహజమని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో ఎఫ్ఐఆర్ జారీ చేయించేందుకు ఎవరు దిశానిర్దేశం చేశారన్న చర్చ పోలీసు వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా మూలాలను తెలుసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.

సివిల్ కేసును క్రిమినల్ చేశారా…?

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును బట్టి తన పేరిట ఉన్న ఇంటిని విక్రయించేందుకు తనతో కాపురం చేయకుండా దూరంగా ఉంటున్న తన భర్త శ్రీనివాసరావు అడ్డుకుంటున్నాడని పేర్కొంది. అంతేకాకుండా తాను ఇంటిని విక్రయించే క్రమంలో శ్రీనివాసరావు అడ్డగించి చంపుతానని బెదిరించాడని, కొట్టాడని ఫిర్యాదులో వివరించింది. అయితే సివిల్ మ్యాటర్ కదా.. సదరు మహిళకు కోర్టుకు వెళ్లాలని సూచించకుండా క్రిమినల్ కేసుగా కేసు నమోదు చేయడం వెనకున్న కారణాలు ఏంటీ అన్న విషయంపైనా ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇల్లు అమ్మడానికి అడ్డంకిగా ఉన్న శ్రీనివాసరావుపై ఎఫ్ఐఆర్ జారీ చేయడంతో భయపడి రాజీకీ వచ్చి ఉంటాడని, దీంతో బాధితురాలు అనుకున్న విధంగా ఇల్లు అమ్మేందుకు అభ్యంతరం లేకుండా పోవడంతో ఎఫ్ఆర్ ను పక్కనపడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి అనుకూలంగా మల్చుకున్నారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు సమాచారం.

పోలీస్ బాస్ సీరియస్..

డమ్మి ఎఫ్ఐఆర్ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారని సమాచారం. ఇందుకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి నివేదికలు పంపించాలని కరీంనగర్ సీపీని ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. డమ్మీ ఎఫ్ఐఆర్ కథలో ఎవరెవరి పాత్ర ఉంది..? బాధ్యులెవరూ..? అన్న వివరాలను తెలుసుకునేందుకు కరీంనగర్ సీపీ సత్యనారాయణ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్టు సమాచారం.


Next Story

Most Viewed