లాభాల్లోకి ఈక్విటీ మార్కెట్.. వరుస నష్టాలకు బ్రేక్

by  |
bsc-market
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గతవారం వరుసగా నాలుగు సెషన్లలో అధిక నష్టాల ద్వారా 59 వేల దిగువకు పతనమైన సూచీలు సోమావారం అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. ఉదయం ప్రారంభం నుంచే దూకుడు పెంచిన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన కంపెనీల ఆదాయాలు, ఆర్‌బీఐ సమీక్ష వంటి అంశాల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీటితో పాటు కీలక కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లాంటి హెవీవెయిట్స్ షేర్లు నష్టాల పరంపర నుంచి స్టాక్ మార్కెట్లను కాపాడాయని విశ్లేషకులు తెలిపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 533.74 పాయింట్లు ఎగసి 59,299 వద్ద క్లోజయింది. నిఫ్టీ 159.20 పాయింట్లు లాభపడి 17,691 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతం పుంజుకోగా, రియల్టీ, పీఎస్‌య్యూ బ్యాంక్, ఫార్మా, మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, డా రెడ్డీస్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించగా, బజాజ్ ఆటో, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.32 వద్ద ఉంది.


Next Story

Most Viewed