హ్యాట్రిక్ లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు!

by  |
హ్యాట్రిక్ లాభాలతో దూసుకెళ్తున్న సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. దేశీయంగా కరోనాను నియంత్రించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సిన్ అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల కారణంగా మార్కెట్లలో సానుకూల ర్యాలీ కొనసాగుతున్నట్టు విశ్లేషకులు తెలిపారు. అదేవిధంగా కరోనా సెకెండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి భారత్‌కు సాయంగా పలు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్న కారణంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు, కీలక రంగాలు షేర్లు మెరుగ్గా ర్యాలీ చేస్తుండటంతో సూచీలు అధిక లాభాల్లో కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు.

ప్రధానంగా బ్యాంకింగ్ రంగం షేర్లు బుధవారం ట్రేడింగ్‌కు కీలక మద్దతునిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 789.70 పాయింట్లు ఎగసి 49,733 వద్ద ముగియగా, నిఫ్టీ 211.50 పాయింట్లు లాభపడి 14,864 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు పుంజుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అత్యధికంగా బలపడింది. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ రంగాలు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 8.32 శాతంతో దూకుడుగా ఉండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలారుతో రూపాయి మారకం విలువ రూ. 74.41 వద్ద ముగిసింది.


Next Story

Most Viewed