వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

by  |
Nifty
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం వరుసగా రెండోరోజూ లాభాలను సాధించాయి. కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనున్నట్టు వచ్చిన వార్తలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు సోమవారం నాటి భారీ నష్టాల నుంచి రికవరీని సాధించగలిగాయి. ఇదే సమయంలో అత్యధిక నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. దీనికితోడు అన్ని రంగాలు పాజిటివ్‌గా ట్రేడవ్వడం, కీలక కంపెనీల షేర్లు మెరుగ్గా ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా స్థిరంగా లాభాల్లో కదలాడాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 611.55 పాయింట్లు ఎగసి 56,930 వద్ద, నిఫ్టీ 184.60 పాయింట్లు పుంజుకుని 16,955 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో అన్ని రంగాలు సానుకూలంగా ర్యాలీ చేశాయి.

ముఖ్యంగా ఫార్మా, మెటల్, ఆటో రంగాలు దాదాపు 2 శాతం వరకు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విప్రో, ఐటీసీ, నెస్లె ఇండియా షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొనగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్ షేర్లు 5 శాతానికి పైన లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.51 వద్ద ఉంది.



Next Story