వరుస నష్టాలకు బ్రేక్!

by  |
వరుస నష్టాలకు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి వారాంతంలో బయటపడ్డాయి. గత మూడు సెషన్లలో నష్టపోయిన సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఐటీ, టెలికాం, రియల్టీ రంగాల్లో భారీ కొనుగోళ్ల మూలంగా అధిక లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం వల్లే లాభాలు నమోదైనట్టు విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కీలక మద్దతు ఇచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 767 పాయింట్లు ఎగసి 60,686 వద్ద, నిఫ్టీ 229.15 పాయింట్లు పుంజుకుని 18,102 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధికంగా 2 శాతం ఎక్కువగా లాభపడింది. రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు బలపడ్డాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.

మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా, రిలయన్స్, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.47 వద్ద ఉంది.


Next Story

Most Viewed