కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. అన్నివైపుల నుంచి మార్కెట్లను ప్రతికూల అంశాలు చుట్టేయడంతో సూచీలు కృంగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాలు ఊపందుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా కుదేలైంది. నిఫ్టీ సీతం 18,000 కిందకు దిగజారింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే బలహీనంగా కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఉండటం, అక్టోబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల(ఎఫ్అండ్ఓ) నెలవారీ గడువు ముగియడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలకు సిద్ధపడటంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో భారతీయ ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాదిలో ఏప్రిల్ 12 తర్వాత గత ఆరు నెలల్లోనే అతిపెద్ద సింగిల్ డే పతనాన్ని చవిచూశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,158 పాయింట్లు(1.89 శాతం) పతనమై 59,984 వద్ద, 353.70 పాయింట్లు(1.94 శాతం) కోల్పోయి 17,857 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధికంగా 5 శాతం కుదేలవగా, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 2-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి మాత్రమే లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.90 వద్ద ఉంది.


Next Story