కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల లాభాలు!

by  |
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల లాభాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. బుధవారం నాటి ధోరణినే కొనసాగిస్తూ రోజంతా మెరుగ్గా ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకూ లాభాలను కొనసాగించాయి. ఇటీవల మార్చి త్రైమాసికానికి సంబంధించి కంపెనీలు సానుకూల ఆదాయాలను వెల్లడిస్తుండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలంగా సంకేతాలు, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న యూరప్, అమెరికా మార్కెట్ల ప్రభావం వంటి పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ప్రధానంగా మెటల్, ఆటో, ఐటీ రంగాలు గురువారం మార్కెట్ల ర్యాలీకి మద్దతిచ్చాయని నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 272.21 పాయింట్లు లాభపడి 48,949 వద్ద ముగియగా, నిఫ్టీ 106.95 పాయింట్ల లాభమతో 14,724 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 2.75 శాతం పుంజుకోగా, ఆటో, ఐటీ, మీడియా, ఫైనాన్స్, రియల్టీ ఇండెక్స్‌లు బలపడ్డాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించగా, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.74 వద్ద ఉంది.

Next Story

Most Viewed