భారీ లాభాల్లో ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. గత కొద్దిరోజులుగా అధిక నష్టాలు లేదంటే అధిక లాభాల మధ్య కదలాడుతున్న సూచీలు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో మాత్రం గడిచిన రెండు నెలల్లోనే అత్యధిక సింగిల్ డే లాభాలు దక్కించుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

దీనికితోడు బుధవారం ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశాల నిర్ణయాలు వెల్లడిపై సానుకూల అంచనాలు ఉండటం, ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్-19 వేరియంట్ ప్రమాదకరమేమీ కాదనే పరిణామాల మధ్య మార్కెట్లు ర్యాలీ చేశాయి. ముఖ్యంగా మెటల్స్, బ్యాంకింగ్ రంగాల్లో భారీగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 886.51 పాయింట్లు ఎగసి 57,633 వద్ద, నిఫ్టీ 264.45 పాయింట్లు పుంజుకుని 17,176 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా 3 శాతం బలపడగా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఐటీ, మీడియా, ఫైనాన్స్, ఆటో రంగాలు 1.6-3 శాతం మధ్య పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్ షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొన్నాయి. మిగిలిన అన్ని కంపెనీ షేర్లు లాభాల్లో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.44 వద్ద ఉంది.


Next Story

Most Viewed