వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో సూచీలు

by  |
వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ వరుసగా రెండోరోజు కూడా భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కొవిడ్ కొత్త వేరియంట్ భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో సూచీలు అధిక లాభాల్లో ర్యాలీ చేశాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి బలమైన జీడీపీ గణాంకాలను ప్రభుత్వం వెల్లడించడంతో ఈక్విటీ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ లాంటి కీలక కంపెనీల షేర్లు మెరుగ్గా రాణించడంతో సెన్సెక్స్ 58 వేల మార్కును అధిగమించింది.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 776.50 పాయింట్లు ఎగసి 58,461 వద్ద, నిఫ్టీ 234.75 పాయింట్లు పుంజుకుని 17,401 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా లాభపడగా, ఆటొ, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మెరుగ్గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. దీంతో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.99 వద్ద ఉంది.


Next Story