బ్యాంకింగ్ మద్దతుతో దూసుకెళ్లిన సూచీలు

by  |
బ్యాంకింగ్ మద్దతుతో దూసుకెళ్లిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. గత కొద్దిరోజులుగా ఒడిదుడుకుల మధ్య కదలాడిన సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఆద్యంతం జోరుగా ర్యాలీ చేశాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిగమించాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత భారీ లాభాల బాట పట్టిన మార్కెట్లు గతవారం లాభాల స్వీకరణకు నెమ్మదించాయి. ఆ తర్వాత సోమవారం ఏకంగా రికార్డు స్థాయిలో సెన్సెక్స్ ఇండెక్స్ 52 వేల మార్క్‌ను దాటగా, నిఫ్టీ 15,300 కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావమే దీనికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు బ్యాంకింగ్ రంగం షేర్లు భారీగా పుంజుకోవడంతో సూచీల జోరు కొనసాగింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 609.83 పాయింట్లు ఎగసి 52,154 వద్ద ముగియగా, నిఫ్టీ 151.40 పాయింట్లు లాభపడి 15,314 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యదికంగా బ్యాంకింగ్ రంగం 3 శాతం పెరగడమే కాకుండా, బ్యాంక్ నిఫ్టీ 37 వేల మార్కును అధిగమించింది. దీంతో నిఫ్టీ బ్యాంక్ గడిచిన 15 రోజుల్లోనే 23 శాతం పెరిగింది. ఇక, ఫైనాన్స్, ప్రైవేట్-పీఎస్‌యూ బ్యాంకులు, రియల్టీ రంగాలు 1.5-3 శాతం మధ్య బలపడ్డాయి. ఐటీ, మెటల్, ఫార్మా సూచీలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2 శాతానికిపైగా దూసుకెళ్లాయి. డా.రెడ్డీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలను పొందాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.79 వద్ద ఉంది.


Next Story

Most Viewed