లాభాల నుంచి నష్టాల్లోకి సూచీలు

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటం, కీలక కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరల పతనం కారణంగా సూచీలు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉదయం ప్రారంభమైన సమయంలో మెరుగైన లాభాలతోనే కొనసాగినప్పటికీ, అనంతర పరిణామాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైగా ఇంట్రాడే నష్టాలను ఎదుర్కొన్నాయని నిపుణులు తెలిపారు.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 66.95 పాయింట్లు కోల్పోయి 52,482 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.95 పాయింట్ల నష్టంతో 15,721 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధిక పతనానికి గురైంది. ప్రధానంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లాంటి సంస్థల షేర్లు ఇంట్రాడే లాభాలను తుడిచిపెట్టేశాయి. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, రిలయన్స్, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా, అల్ట్రా సిమెంట్, టైటాన్ బజాజ్ ఆటో లాభాలను దక్కించుకోగా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.32 వద్ద ఉంది.

Next Story

Most Viewed