వరుస నష్టాల నుంచి లాభాల్లోకి సూచీలు!

by  |
వరుస నష్టాల నుంచి లాభాల్లోకి సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి లాభాలను సాధించాయి. గత రెండు సెషన్లలో భారీ నష్టాలను చూసిన సూచీలు బుధవారం సెలవు తర్వాత పుంజుకున్నాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అనంతరం కోలుకున్నాయి. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ ప్రపంచ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల మద్దతుతో ప్రారంభ నష్టాల నుంచి మార్కెట్లు కోలుకున్నాయని నిపుణులు తెలిపారు. టీకా పంపిణీ మెరుగ్గా ఉన్నా, పెరుగుతున్న కొవిడ్ కేసుల కారణంగా సూచీలు దిద్దుబాటు దశలో ఉన్నాయని, రానున్న రోజుల్లో కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మార్కెట్లు ఆధారపడి ర్యాలీ చేయనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

గురువారం నాటి మార్కెట్ల ర్యాలీకి ప్రధానంగా మెటల్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు కీలక మద్దతు ఇచ్చిన కారణంగానే మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 374.87 పాయింట్లు ఎగసి 48,080 వద్ద ముగియగా, నిఫ్టీ 109.75 పాయింట్లు లాభపడి 14,406 వద్ద ముగిసింది. నిఫ్టీలో మునుపటి సెషన్లో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్ రంగం షేర్లు గురువారం ట్రేడింగ్‌లో బలమైన కొనుగోళ్లను సాధించాయి. అలాగే మెటల్, మీడియా, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లు కొనుగోళ్లను చూడగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాలను సాధించగా, టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహింద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75 వద్ద ఉంది.

Next Story