ఊగిసలాట మధ్య లాభాల్లోకి మారిన సూచీలు!

by  |
sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊరట లభించింది. గత నాలుగు సెషన్లుగా పతనమైన సూచీలు గురువారం నాటి ట్రేడింగ్‌లో లాభాలను సాధించాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. దీనివల్ల రోజంతా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయని విశ్లేషకులు తెలిపారు.

ఉదయం అధిక లాభాలతో మొదలైన సూచీలు ఎనర్జీ, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల మిడ్-సెషన్ సమయంలో నష్టాల్లోకి మారాయని, దీంతోపాటు ప్రస్తుత వారానికి సంబంధించి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ముగియడంతో మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాటకు గురయ్యాయని, అనంతరం చివరి గంటలో కొంతమేర కోలుకుని స్వల్ప లాభాలకు పరిమితమైనట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 113.11 పాయింట్లు పుంజుకుని 57,901 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 17,248 వద్ద ముగిశాయి.

నిఫ్టీ లో మీడియా ఇండెక్స్ అధికంగా 2 శాతం వరకు కుదేలైంది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు బలపడ్డాయి. సెన్స్కెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటాన్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను సాధించగా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.11 వద్ద ఉంది.


Next Story