ఒడిదుడుకుల తర్వాత లాభాలను దక్కించుకున్న సూచీలు

by  |
ఒడిదుడుకుల తర్వాత లాభాలను దక్కించుకున్న సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గతవారం వరుస సెషన్లలో పతనమైన తర్వాత సోమవారం ఉదయం సూచీలు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. మిడ్-సెషన్ వరకు ఊగిసలాటకు గురైన తర్వాత దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ ధోరణి, చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిణామాలతో చివరి వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, చివరి గంటలో కీలక రంగాల్లో షేర్ల కోసం మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయి.

ఫైనాన్స్, మెటల్ రంగాలు రాణించడంతో మార్కెట్లు లాభాలతో ముగిసాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 145.43 పాయింట్లు పుంజుకుని 60,967 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 10.50 పాయింట్లు లాభపడి 18.125 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ 2 శాతం బలపడగా, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకు రంగాలు పుంజుకున్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 10.80 శాతం దూసుకెళ్లగా, యాక్సిస్ బ్యాంక్, డా రెడ్డీస్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను సాధించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.10 వద్ద ఉంది.

Next Story