51 వేలను దాటిన సెన్సెక్స్

by  |
51 వేలను దాటిన సెన్సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతూనే ఉంది. గతవారం బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహానికి తోడు, ఆర్థికవృద్ధిపై ఆర్‌బీఐ నిర్ణయంతో సూచీలు మరోసారి రికార్డులతో దూసుకెళ్తున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో పాటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాంకుల ప్రైవేటీకరణను అమలుపరిచేందుకు ఆర్‌బీఐతో కలిసి పనిచేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. ఈ కారణంతో వరుసగా ఆరో రోజూ సూచీలు భారీగా లాభాలను దక్కించుకున్నాయి. గత పది నెలల్లో మొదటిసారిగా గతవారం బెస్ట్ వీక్‌గా నిలిచిన తర్వాత ఈ వారం కూడా సూచీలు అదే ఉత్సాహంతో మొదలయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాటి ర్యాలీలో ఉదయం నుంచే సూచీలు భారీ లాభాలతో కదలాడాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల షేర్ల అండతో సెన్సెక్స్ ఇండెక్స్ తొలిసారిగా 51 వేలు, నిఫ్టీ 15 వేల మైలురాయిని అధిగమించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 617.14 పాయింట్లు ఎగసి 51,348 వద్ద ముగియగా, నిఫ్టీ 191.55 పాయింట్లు లాభపడి 15,115 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, మెటల్ సూచీలు 3 శాతానికిపైగా ర్యాలీ చేయడంతో ఎనిమిది రంగాలు సానుకూలంగా కదలాడాయి. అలాగే, ఐటీ, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, బ్యాంక్ సూచీలు 1-2.5 శాతం మధ్య ర్యాలీ చేశాయి. ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతికూలంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం అత్యధికంగా 7 శాతానికిపైగా ర్యాలీ చేయగా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, టైటాన్ షేర్లు 2 శాతానికిపైగా ర్యాలీ చేశాయి. ఇక, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.89 వద్ద ఉంది.



Next Story

Most Viewed