వారాంతం కుదేలైన మార్కెట్లు

by  |
వారాంతం కుదేలైన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బడ్జెట్ భయంలో కదలాడుతున్నాయి. ఇటీవల వరుస భారీ నష్టాలను నమోదు చేస్తున్న సూచీలు శుక్రవారం సైతం అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో వరుసగా ఆరో రోజూ కుదేలయ్యాయి. కేంద్ర బడ్జెట్ కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం, లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో వారాంతం మార్కెట్లు భారీ నష్టాలను చూడక తప్పలేదు. ఈ వారంలో మొత్తం ఐదు సెషన్లలోనూ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల మద్ధతుతో కొంత కోలుకుంటున్న సంకేతాలను ఇచ్చినప్పటికీ, అనంతరం ఆర్థిక సర్వే కారణంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

దీంతొ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 588.59 పాయింట్లను కోల్పోయి 46,285 వద్ద ముగియగా, నిఫ్టీ 182.95 పాయింట్లు నష్టపోయి 13,634 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, రియల్టీ రంగాలు బలపడగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడితో నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా డా రెడ్డీస్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఓఎన్‌జీసీ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీల్, టెక్ మహీంద్రా షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.88 వద్ద ఉంది.

Next Story

Most Viewed