వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!

by  |
వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కనిపించినప్పటికీ బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడి లోనవ్వడంతో శుక్రవారం స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు అనంతరం చివరి వరకు అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఆటో రంగాల షేర్లు లాభాలతో ట్రేడింగ్ కొనసాగించడంతో వరుసగా మూడో రోజు లాభాలను సాధించగలిగాయి. మిడ్-సెషన్ సమయంలో కీలక రంగాల మద్ధతుతో ఇంట్రాడే గరిష్ఠాలను తాకిన సూచీలు అనంతరం వారాంతం నేపథ్యంలో మదుపర్ల లాభాల స్వీకరణతో తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 28.35 పాయింట్ల లాభంతో 48,832 వద్ద ముగియగా, నిఫ్టీ 36.40 పాయింట్లు లాభపడి 14,617 వద్ద ముగిసింది.

గురువారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఐటీ దిగ్గజం విప్రో అంచనాల కంటే అధికంగా లాభాలను సాధించింది. దీంతో శుక్రవారం విప్రో స్టాక్ 9 శాతానికి పైగా ర్యాలీ చేసి, ఆల్‌టైమ్ హై రూ. 473.65ను తాకింది. నిఫ్టీలో ఫార్మా ఇండెక్స్ అధికంగా 2 శాతం పుంజుకోగా, మీడియా, ఐటీ, ఆటో రంగాలు 1-2 శాతం మధ్య బలపడ్డాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డా రెడ్డీస్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.41 వద్ద ఉంది.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story