49 వేల దిగువకు సెన్సెక్స్!

by  |
49 వేల దిగువకు సెన్సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనక తప్పలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉదయం ప్రారంభం నుంచే డీలాపడిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయని, దాదాపుగా అన్ని రంగాలు కుదేలయ్యాయని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 470.40 పాయింట్లు కోల్పోయి 48,564 వద్ద ముగియగా, నిఫ్టీ 152.40 పాయింట్ల నష్టంతో 14,281 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ రంగం అత్యధికంగా 4.5 శాతం కుదేలవగా, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా 2 శాతం వరకు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, డా రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.28 వద్ద ఉంది.


Next Story