డీలాపడ్డ సూచీలు.. చివర్లో కాస్త ఊరట!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ కీలక సూచీలు కుదేలవడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం నుంచే భారీ నష్టాలకు గురైన స్టాక్ మార్కెట్ మిడ్-సెషన్ తర్వాత కొంత మేరకు కోలుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికమవడంతో నిఫ్టీ తన కీలకమైన 15 వేల మార్కు కింద దిగజారింది. అలాగే, ఆసియా మార్కెట్లు ఆటుపోట్లకు గురవడం, అమెరికా మార్కెట్లు గత ప్రతికూలత నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నీరసించాయి. మరోవైపు దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం, సోమవారం వెల్లడైన టోకు ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్ఠాలకు చేరుకోవడంతో సూచీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు నిరాశకు లోనయ్యాయి. మిడ్-సెషన్ తర్వాత మెటల్, ఎనర్జీ రంగాల నుంచి కొనుగోళ్ల మద్ధతు లభించడంతో కొంతమేర నష్టాలను తగ్గించుకోగలిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు కోల్పోయి 50,395 వద్ద ముగిసింది. నిఫ్టీ 101.45 పాయింట్లు నష్టపోయి 14,929 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫైనాన్స్, ఫార్మా రంగాలు 1 శాతం మేర డీలాపడగా, బ్యాంక్, మీడియా, ప్రైవేట్ బ్యాంకుల సూచీలు నీరసించాయి. మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్‌టీ, ఏషియన్ పెయింట్, డా రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.48 వద్ద ఉంది.

Next Story

Most Viewed