అధిక లాభాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు!

by  |
sensex up
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల కారణంగా సూచీలు మంగళవారం ఉదయం భారీ లాభాలు సాధించాయి. అనంతరం బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు చివర్లో ఫ్లాట్‌గా ముగిశాయి. తొలుత గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో నిఫ్టీ 50, బీఎస్ఈ సెన్సెక్ ఆల్‌టైమ్ గరిస్ఠ స్థాయిలకు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 53,057 మార్కును చేరుకోగా, నిఫ్టీ సైతం ఆల్‌టైమ్ హై 15,901ను నమోదు చేసింది. ప్రధానంగా ఐటీ, ఆటో రంగాల్లో షేర్ల కొనుగోళ్లు తాజా గరిష్ఠాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మంగళవారం ట్రేడింగ్‌లో దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి అత్యధిక లాభాలను దక్కించుకుంది. కంపెనీ పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాన్ని తగ్గించేందుకు కార్ల ధరలను పెంచనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఏ నేపథ్యంలో కంపెనీ షేర్ ధర 5 శాతానికిపైగా పుంజుకుంది రూ. 7,263.75 వద్ద ర్యాలీ చేసింది. మిడ్-సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణవైపు మొగ్గు చూపడంతో సూచీలు నీరసించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 14.25 పాయింట్ల లాభంతో 52,588 వద్ద ముగియగా, నిఫ్టీ 26.25 పాయింట్లు లాభపడి 15,772 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, ఐటీ, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది.

మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాఉ బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి ఏకంగా 5.25 శాతం దూసుకెళ్లగా, ఎల్అండ్‌టీ, ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, టైటాన్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు లాభాలను సాధించాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.33 వద్ద ఉంది.


Next Story

Most Viewed