రికార్డుల జోరు కొనసాగిస్తున్న నిఫ్టీ..

by  |
రికార్డుల జోరు కొనసాగిస్తున్న నిఫ్టీ..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ సోమవారం లాభాలను సాధించాయి. ఉదయం నుంచే సానుకూలంగా కదలాడిన సూచీలు చివరివరకు అదే ధోరణిని కొనసాగించాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు దేశీయంగా కరోనా కేసులు రెండు నెలల కనిష్టానికి చేరుకొవడంతో నిఫ్టీ 50 మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ సైతం జీవిత కాల గరిష్ఠాలకు దాదాపు 200 పాయింట్ల దూరంలో ఉంది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లభించడం, దేశీయంగా టీకా పంపిణీ వేగవంతం కావడం, రుతుపవనాల రాక వంటి పరిణామాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 228.46 పాయింట్లు ఎగసి 52,328 వద్ద ముగియగా, నిఫ్టీ 81.40 పాయింట్లు లాభపడి 15,751 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధిక లాభాలను దక్కించుకోగా, మీడియా, ఆటో, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఆల్ట్రా సిమెంట్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, డా రెడ్డీస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.80 వద్ద ముగిసింది.



Next Story