వరుసగా రెండోరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం వరుసగా రెండోరోజూ నష్టాలను ఎదుర్కొన్నాయి. శుక్రవారం ఉదయం నుంచే డీలాపడిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో పాటు కొన్ని దేశాల్లో కొవిడ్ డెల్టా వేరియంట్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు నీరసించాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు రెండు నెలల కనిష్ఠానికి కుదేలయ్యాయి.ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 182.75 పాయింట్లు కోల్పోయి 52,386 వద్ద ముగియగా, నిఫ్టీ 38.10 పాయింట్లు నష్టపోయి 15,689 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా పతనమవగా, మెటల్ రంగం పుంజుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో మెటల్ రంగంలో కొనుగోళ్లు కొంతమేర నష్టాలను తగ్గించాయి.

ఇక, ఫార్మా, రియల్టీ, మీడియా, ఎఫ్ఎంసీజీ రంగాల్లోనూ కొనుగోళ్లు కొనసాగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకి షేర్లు అధిక లాభాలను సాధించగా, బజాజ్ ఆటో, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.62 వద్ద ఉంది.



Next Story

Most Viewed