భారీ నష్టాలను నమోదు చేసిన సూచీలు

by  |
Soochilu-214
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి అత్యధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. గత రెండు సెషన్లలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు బుధవారం డీలా పడ్డాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ వరకు లాభనష్టాల మధ్య కదలాడాయి. ప్రధానంగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల స్థాయికి చేరుకోవడంతో మదుపర్లు ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన చెందారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ జీవితకాల గరిష్ఠాల నుంచి 850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన ధోరణి కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాలను పోగొట్టుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. దీనికితోడు దేశీయంగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభం కావడం, ఈ సమావేశంలో కొవిడ్-19 ప్రభావంతో సర్దుబాటు ధోరణిని కొనసాగించకపోవచ్చనే సంకేతాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 555.15 పాయింట్లను కోల్పోయి 59,189 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 176.30 పాయింట్లు నష్టపోయి 17,646 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటం ఇండెక్స్ దాదాపుగా 3 శాతం పతనమవగా, ఆటో, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, టైటాన్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, డా రెడ్డీస్, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, ఎన్‌టీపీసీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.04 వద్ద ఉంది.


Next Story