ఊపందుకున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లోకి నిఫ్టీ

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు కరెన్సీ మార్కెట్లు అప్రమత్తంగా ఉండటంతో సూచీలు సానుకూలంగా కదలాడాయి. దీనికి తోడు దేశీయంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఫలితాలు మార్కెట్లలో మదుపర్లను ఆకర్షించే స్థాయిలో ఉన్నాయని, ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లు అధిక లాభాల్లో ట్రేడయినట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, మార్కెట్లో కీలక కంపెనీలు షేర్లు సానుకూలంగా ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చిందని తెలిపారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాల్లో భారీగా కొనుగోళ్ల జోరు కనబడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 638.70 పాయింట్లు ఎగసి 52,837 వద్ద ముగియగా, నిఫ్టీ 191.95 పాయింట్లు లాభపడి 15,824 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ రంగం మినహా అన్ని రంగాలు కొనుగోళ్లను సాధించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.48 వద్ద ఉంది.


Next Story