కరోనా భయంతో మార్కెట్లకు మరోసారి వారాంతం నష్టాలు

by  |
కరోనా భయంతో మార్కెట్లకు మరోసారి వారాంతం నష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. గతంలో లాగే వారాంతం నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు తప్పించుకోలేకపోయాయి. ఉదయం నుంచే ఆటుపోట్ల మధ్య ర్యాలీ చేసిన సూచీలు మిడ్-సెషన్ తర్వాత నష్టాల్లోకి మారిపోయాయి. మధ్యాహం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయని నిపుణులు తెలిపారు. అలాగే, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, మహీంద్రా వంటి హెవీవెయిట్ షేర్లు బలహీనపడటంతో మార్కెట్లు క్షీణించాయి. దీనికితోడు దేశంలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసులతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 202.22 పాయింట్లు కోల్పోయి 47,878 వద్ద ముగియగా, నిఫ్టీ 64.80 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అధికంగా పతనమవగా, రియల్టీ, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఆటో, మెటల్ రంగాలు నీరసించాయి. పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఫైనాన్స్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎంఅండ్ఎం, డా రెడ్డీస్, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.03 వద్ద ఉంది.



Next Story

Most Viewed