లాభాల్లో స్టాక్ మార్కెట్లు

by  |
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత మిడ్ సెషన్ సమయంలో సూచీలు ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ చివరికి లాభాల్లోనే ముగిశాయి. భారీ ప్యాకేజీ అంచనాలతో అమెరికా మార్కెట్లు పుంజుకోవడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనబడింది. మిడ్ సెషన్‌కు ముందు వరుస సెషన్ లాభాలను స్వీకరించేందుకు మదుపర్లు సిద్ధపడటంతో ఆటుపోట్లు ఎదురయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అనంతరం సానుకూల సంకేతాలతో మార్కెట్లు కోలుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 162.94 పాయింట్లు ఎగిసి 40,707 వద్ద ముగియగా, నిఫ్టీ 40.85 పాయింట్లు లాభపడి 11,937 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా రియల్టీ 4 శాతానికి పైగా పుంజుకోగా, బ్యాంకింగ్ బలపడింది. మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడగా, టీసీఎస్, రిలయన్స్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.78 వద్ద ఉంది.



Next Story

Most Viewed