కొత్త వైరస్ భయంతో కుప్పకూలిన మార్కెట్లు

by  |
కొత్త వైరస్ భయంతో కుప్పకూలిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత కొంత కాలంగా రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. 2020 ఏడాది ముగుస్తున్న సందర్భంలో అదే రికార్డు స్థాయిలో సోమవారం పతనమయ్యాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలను చూసిన సూచీలు మిడ్ సెషన్‌కు ముందు కొంత కోలుకున్నట్టు కనిపించినప్పటికీ తర్వాత స్థిరంగా కొనసాగాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏకంగా 2000 పాయింట్ల వరకు కుప్పకూలిన సెన్సెక్స్ తర్వాత కోలుకున్నాయి. బ్రిటన్‌తో పాటు అమెరికాల్లో కొత్త రకం వైరస్ భయాలతో మార్కెట్లలో కదలిక మొదలైందని, దీనికితోడు యూరప్ దేశాలు మరోసారి ఆంక్షలను విధించాలని భావిస్తున్న వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు, దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతవారం రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ అందరినీ భయపెట్టింది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో అక్కడ పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆంక్షలను విధించాల్సి వచ్చింది. భారత్‌తో పాటు అనేక దేశాలు బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిలిపేయడంతో దేశీయంగా ఇన్వెస్టర్లు కంగారు పడ్డారని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల మార్కెట్లలో జీవితకాల గరిష్ఠాలు నమోదైన తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రికార్డు లాభాలు నమోదైన సందర్భాల్లో లాభాల స్వీకరణ సాధారణమేనని, దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉండటంతో రికార్డు స్థాయిలోనే పతనం కూడా నమోదైనట్టు నిపుణులు పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో దేశీయంగా మదుపర్లు అన్ని రంగాల్లో అమ్మకాలకు సిద్ధపడ్డారు. దీనివల్ల సెన్సెక్స్, నిఫ్టీ చెరో 3 శాతం నష్టపోయాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,406.73 పాయింట్లు పతనమై 45,553 వద్ద ముగియగా, నిఫ్టీ 432.15 పాయింట్లు పడిపోయి 13,328 వద్ద ముగిసింది. నిఫ్టీలో అమ్మకాల ఒత్తిడితో కీలక రంగాల్లో ఒక్క షేర్ కూడా లాభపడలేదు. బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఫార్మా, మెటల్, ఆటో రంగాలు 4 శాతానికి పైగా డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లోనూ అన్ని రంగాలు నష్టాలను దక్కించుకున్నాయి. ప్రధానంగా ఓఎన్‌జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.02 వద్ద ఉంది.

Next Story

Most Viewed