చివరి రోజు స్వల్ప లాభాల్లో సూచీలు!

by  |
చివరి రోజు స్వల్ప లాభాల్లో సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు 2020 ఏడాది చివరి రోజును స్వల్ప లాభాలతో ముగించాయి. గత కొద్దిరోజులుగా వరుస రికార్డులను నమోదు చేసిన సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే ఆటుపోట్లను ఎదుర్కొన్న సూచీలు తర్వాత నెమ్మదిగా కదలాడాయి. సెలవుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్యం సన్నగిల్లడంతో ప్రపంచ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. వీటి ప్రభావంతో దేశీయంగా మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. గురువారం నాటి మార్కెట్లో నిఫ్టీ మొదటిసారిగా 15 వేల మార్కును చేరుకున్నప్పటికీ ఎక్కువ సమయం ఆ రికార్డును నిలుపుకోలేకపోయింది.

కరోనా సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ వేగంగా కోలుకోవడంపై పెట్టుబడిదారుల్లో ఆశలను పెంచిందని, అయితే ఏడాది చివరి రోజు నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి 5.11 పాయింట్లు లాభపడి 47,751 వద్ద ముగియగా, నిఫ్టీ 0.20 పాయింట్లు నష్టపోయి 13,981 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్, టైటాన్ షేర్లు లాభపడగా, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.04 వద్ద ఉంది.



Next Story

Most Viewed