నిఫ్టీ తొలిసారిగా 13 వేల మైలురాయి!

by  |
నిఫ్టీ తొలిసారిగా 13 వేల మైలురాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి దూకుడుగా ర్యాలీ చేశాయి. గత వారం రోజులుగా కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో సూచీలు మరోసారి లాభాలను నమోదు చేశాయి. దేశీయంగా పరిణామాలు సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతు తెలుపుతున్నారు. ప్రధానంగా కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరీక్షల్లో కీలకమైన కంపెనీలు మెరుగైన ఫలితాలను వెల్లడిస్తుండటంతో మార్కెట్లు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇదివరకు సెన్సెక్స్ ఇండెక్స్ జీవితకాల గరిష్టాల రికార్డులను దక్కించుకోగా, మంగళవారం నాటి మార్కెట్లలో నిఫ్టీ తొలిసారిగా 13 వేల మైలురాయిని సాధించింది.

ఇక, మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 445.87 పాయింట్లు ఎగసి 44,523 వద్ద ముగియగా, నిఫ్టీ 128.70 పాయింట్లు లాభపడి 13,055 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, నెస్లె ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.02 వద్ద ఉంది.


Next Story