దలాల్ స్ట్రీట్‌లో హోళీ కళ!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రెండు రోజుల భారీ నష్టాల నుంచి పుంజుకున్నాయి. ఇటీవల కరోన భయాలు, బాండ్ మార్కెట్ల ప్రతికూలత నేపథ్యంలో డీలాపడిన తర్వాత వారాంతం దలాల్ స్ట్రీట్‌లో హోళీ కళ కనిపించింది. రెండు రోజుల అధిక నష్టాల కారణంగా షేర్ల కొనుగోలు పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారాంతంలో సూచీలు భారీ లాభాలతో ముగిశాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు అమెరికా జీడీపీ గణాంకాలు, నిరుద్యోగం ఊహించిన దానికంటే తక్కువగా నమోదవడంతో అమెరికా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై సానుకూలంగా కనిపించింది. అదేవిధంగా మదుపర్లు విలువైన షేర్ల కొనుగోళ్లపై దృష్టి సారించడం, దేశీయంగా కరోనా టీకా పంపిణీ వేగవంతంగా ఉండటం మార్కెట్లకు కలిసొచ్చిందని విశ్లేషకులు తెలిపారు.

శుక్రవారం మార్కెట్ల భారీ లాభాలకు టాటా గ్రూప్ సాయపడింది. సుప్రీంకోర్టు టాటాసన్స్‌కి అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఈ సంస్థకి చెందిన స్టాక్స్‌లో ర్యాలీకి కారణమైంది. దీంతో మార్కెట్లలో జోష్ పెరిగింది. ముఖ్యంగా టాటా స్టీల్ అత్యధికంగా 6 శాతం ర్యాలీ చేసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 568.38 పాయింట్లు ఎగసి 49,008 వద్ద ముగిసింది. నిఫ్టీ 182.40 పాయింట్లు లాభాపడి 14,507 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 4 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ ఇండెక్సులు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకి షేర్లు మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.54 వద్ద ఉంది.


Next Story

Most Viewed