మార్కెట్ల నెత్తిపై కరోనా నృత్యం!

by  |
మార్కెట్ల నెత్తిపై కరోనా నృత్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లను కరోనా ఇప్పట్లో వీడేలా లేదు. గత వారాంతంలో బేర్ మార్కెట్ల విరామం అనంతరం పుంజుకున్న మార్కెట్లు భారీ లాభాలను చూశాయి. అయితే, ఆ లాభాల జోరు ఎంతోసేపు నిలవలేదు. శుక్రవారం నాటి లాభాలు మొత్తం సోమవారం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే ఆవిరయ్యాయి. దీంతో మార్కెట్లకు పట్టిన కరోనా ఇంకా వీడలేదని స్పష్టమైంది. ఉదయం 10.45 సమయంలో 1990 పాయింట్ల భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు క్లోజయ్యే సమయానికి 2,713.14 పాయింట్లను కోల్పోయి దారుణ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. నిఫ్టీ కూడా 756.10 పాయింట్ల నష్టంతో 9,199 వద్ద క్లోజయింది. దేశంలో కరోనా కేసులు వందకు మించి నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. అంతర్జాతీయంగా కూడా లక్షా యాభైవేలకు మించి నమోదయ్యాయి. ఈ పరిణామాలతో ప్రపంచ దేశాల మార్కెట్లకు తోడు దేశీయ మార్కెట్లు భారీ పతనం నుంచి తప్పించుకోలేకపోయాయి. కరోనా ఇప్పట్లో వీడదనే ఆందోళనతో మదుపర్లు వెనక్కి తగ్గుతున్నారు.

ఫెడ్ వడ్డీరేట్ల కోత..

ఇక, యూఎస్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే బ్లాక్ మండే తప్పదనే సందేహముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్ 4.8 శాతం కృంగిపోగా, డొజోన్స్ ఫ్యూచర్స్ 4.6 శాతం పతనమైంది. నాస్‌దాక్ సైతం 4.5 శాతం దిగజారింది. యూఎస్ మార్కెట్లు బేర్ మార్కెట్లన్ వీడలేదని మదుపర్లు భావిస్తున్నారు. దీనికితోడు అమెరికా ఫెడ్ కీలకమైన వడ్డీరేట్లను తగ్గించింది. ఈ పరిణామం కూడా మదుపర్లలో సందేహాలను పెంచింది.

అంతేకాకుండా, అంతర్జాతీయంగా భవిష్యత్తులొ కరోనా ఇంకా తీవ్రమవుతుందనే సంకేతాలు కూడా మార్కెట్ల పతనానికి కారణంగా నిలిచాయి. గత వారం నాటికి చైనా నుంచి వచ్చిన యాక్టివ్ కరోనా కేసులు 29 శాతం మాత్రమే ఉంటే, మిగిలిన 71 శాతం ఇతర దేశాల్లో నమోదవడం మరింత భయాన్ని కలిగిస్తోంది. ఇటలీ, ఇరాన్, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కరోనాను అరికట్టేందుకు గాను ఆ దేశాలు పూర్తీగా నిర్భంధాన్ని ప్రకటించుకున్నాయి. ఇక జర్మనీ ఛాన్సలర్ తమ దేశంలో 70 శాతం మందికి కరోనా సోకే ప్రమాదముందని ప్రకటించడంతో భయాలు మరింత పెరిగాయి.

ఎఫ్‌పీఐలు వెనక్కి..

అంతేకాకుండా, ఇండియన్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు భారీ తగ్గిపోతున్నాయి. ఒక్క మార్చి నెలలోనే రూ. 37,976 కోట్ల ఎఫ్‌పీఐలు ఉపసమ్హరించబడ్డాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 24,776 కోట్లు, డెబ్ట్ మార్కెట్ల నుంచి రూ. 13,200 కోట్లు విదేశీ ఇవెన్స్టర్లు మార్కెట్ల నుంచి ఉపసమ్హరించుకున్నారు.

డేటాల ఆందోళన..

ఇక సోమవారం వివిధ దేశాలు కీలమైన ఆర్థికవ్యవస్థల డేటాలను విడుదల చేయనున్నాయి. ఇండియాలో టోకు ద్రవ్యోల్బణ డేటా, చైనా పారిశ్రామికోత్పత్తి డేటా, హౌస్ ప్రైస్ ఇండెక్స్, రిటైల్ సేవల డేటాలను ఆయా దేశాలు వెల్లడించనున్నాయి. యూరప్ కీలక సమావేశాలను నిర్వహించనున్నాయి

tags : sensex, nifty, BSE, NSE, stock market, crude oil, coronavirus, fpi

Next Story

Most Viewed