కరోనా భయాలతో కుదేలైన మార్కెట్లు

by  |
కరోనా భయాలతో కుదేలైన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా కొవిడ్-19 వ్యాప్తి ఆందోళనలు మళ్లీ పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్ సహా ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో కొవిడ్-19 ఉధృతమవుతున్న కారణంగా లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు.

దీంతో యూరప్, అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ పరిణామాలతో దేశీయంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. ఉదయం ప్రారంభమైన సమయం నుంచే మార్కెట్లు వైరస్ భయాలతో డీలాపడ్డాయి. మిడ్ సెషన్ సమయానికి కొంత మెరుగుపడి సెన్సెక్స్ 40 వేల మార్కును దాటినప్పటికీ అనంతరం అమ్మకాలు వెల్లువెత్తడంతో మళ్లీ పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 172.61 పాయింట్లు కోల్పోయి 39,749 వద్ద ముగియగా, నిఫ్టీ 58.80 పాయింట్లు నష్టపోయి 11,670 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ మాత్రమే అతి స్వల్పంగా లాభపడగా, మిగిలిన అన్ని రంగాలు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభపడగా, ఎల్అండ్‌టీ, టైటాన్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.45 వద్ద ఉంది.


Next Story