స్టాక్ మార్కెట్లకు వారాంతం భారీ నష్టాలు!

by  |
స్టాక్ మార్కెట్లకు వారాంతం భారీ నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో వరుసగా నాలుగు రోజులుగా నమోదైన లాభాలకు వారాంతం బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభం నుంచే డీలాపడిన సూచీలు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. వారాంతం కావడంతో ఏ దశలోనూ పుంజుకోలేకపోయాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4 లక్షలకు చేరువలో నమోదవడంతో కరోనా భయాలు ఇన్వెస్టర్లను వీడలేదు. దీంతోపాటు ఆసియా మార్కెట్లు నీరసించడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణ పెరుగుతున్న సంకేతాల నేపథ్యంలో పెట్టుబడిదారులు అమ్మకాలకు సిద్ధపడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి.

వరుస లాభాలకు తోడు వచ్చే నెల నుంచి లాక్‌డౌన్ ఉండే అవకాశాలున్నాయనే వార్తలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారని నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటన్నిటితో పాటు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. అదేవిధంగా కరోనా కేసుల పెరుగుదలతో టీకా కొరత, ఆర్థిక పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 983.58 పాయింట్లు పతనమై 48,782 వద్ద ముగియగా, నిఫ్టీ 263.80 పాయింట్ల దిగజారి 14,631 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫార్మా షేర్లు మినహాయించి మిగిలిన అన్ని రంగాలు కుదేలయ్యాయి. బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం పతనమవగా, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1-3 శాతం మధ్య పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, డా రెడ్డీస్, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన షేర్లు డీలాపడ్డాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 4 శాతానికి పైగా దిగజారాయి. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఎంఅండ్ఎం, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.08 వద్ద ఉంది.


Next Story

Most Viewed