కరోనా భయంలో స్టాక్ మార్కెట్లు!

by  |
కరోనా భయంలో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. దేశీయంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయంతో సూచీలు భారీగా నష్టపోయాయి. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా కరోనా భయాలు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉదయం నుంచే నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు చివరి వరకు అదే ధోరణిలో ట్రేడింగ్ జరిగి భారీ నష్టాలను చూశాయి. ప్రధానంగా దేశంలో కరోనా కేసులు నాలుగు నెలల గరిష్ఠాలకు చేరుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఇదే స్థాయిలో ఉండటంతో మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 871.13 పాయింట్లు కోల్పోయి 49,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 265.35 పాయింట్లు నష్టపోయి 14,549 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్టీ రంగాలు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.56 వద్ద ఉంది. ‘దేశీయంగా కరోనా కేసులు పెరగడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా లేకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. వస్తువుల ధరలు, బాండ్ ఈల్డ్స్ నెమ్మదించే వరకు ఈక్విటీ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు కనిపించేలా లేవని’ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రైటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ చెప్పారు.


Next Story

Most Viewed