భారీ లాభాల్లో ఈక్విటీ మార్కెట్లు

by  |
భారీ లాభాల్లో ఈక్విటీ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా భారీ నష్టాలను నమోదు చేసిన తర్వాత గత రెండు సెషన్లుగా లాభాల బాట పట్టిన ఈక్విటీ మార్కెట్లు సోమవారం మళ్లీ భారీ లాభాలను నమోదు చేశాయి. కొవిడ్-19 వ్యాప్తి ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా ప్రణాళికలను సిద్ధం చేస్తుండగా, దేశీయాంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లలో ఉత్సాహాన్నిస్తున్నరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్ల మూలధన సాయాన్ని సమకూర్చుతుందనే ప్రకటనతో మార్కెట్లలో ర్యాలీ జరుగుతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 592.97 పాయింట్ల అధిక లాభాలతో 37,981 వద్ద ముగియంగా, నిఫ్టీ 177.30 పాయింట్లు ఎగిసి 11,227 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్, మీడియా, మెటల్, ఆటో, రియల్టీ రంగాలు 3 శాతానికి పైగా లాభపడగా, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా షేర్లు మాత్రమే నష్టపోగా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లోనే నమోదు చేశాయి.

ప్రధానంగా ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 6 శాతానికిపైగా ర్యాలీ చేయగా, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, టైటాన్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. ట్రేడర్లు ఫైనాన్షియల్ కొనుగోళ్ల మద్దతుతో పాటు ఆటో, ఫార్మా కూడా సోమవారం నాటి ర్యాలీకి తోడయ్యాయి. మరోవైపు రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ వార్తలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సహకారంతో మార్కెట్లు సానుకూలంగా కదలాడాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ ఎస్ రంగనాథన్ తెలిపారు.



Next Story

Most Viewed